
ఈనెల 13వ తేదీన మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
యోగ ప్రాముఖ్యతను ప్రజలకు విస్తృతంగా వివరించి ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మొత్తం 2,500 మంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ఈనెల 17వ తేదీన త్రిపురాంతకంలో నిర్వహించనున్న టెంపుల్ యోగా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా కార్యక్రమాలను ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించే వేదికగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ అధికారి బాలాజీ నాయక్, ఉద్యాన శాఖ అధికారి రమేష్, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ పద్మావతి, ఆయుష్, మెప్మా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.