
మార్కాపురం: స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీఓ, ఇన్ఛార్జి డీఆర్ఓ శివరామిరెడ్డి పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న గౌతు లచ్చన్న, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ శివరామిరెడ్డిని గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు కీర్తి సాయన్న, కంచర్ల కేశవయ్య, వేములకొండ శ్రీనివాసులు, గజ్జ రంగనాయకులు, మాదాసు రంగనాయకులు మాట్లాడుతూ.. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుతో పాటు గౌడ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆర్డీఓను కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గజ్జ అంకయ్య, కొమర వెంకటేశ్వర్లు, బత్తిని శ్రీనివాసులు, కంచర్ల శరభయ్య, దొంత కృష్ణ, కంచర్ల చెన్నకృష్ణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.