చలో నిజామాబాద్ పోస్టర్ ఆవిష్కరణ.. జగిత్యాలలో జనసేన ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల: ఆగస్టు 8న నిజామాబాద్‌లో జరగనున్న పార్లమెంటు స్థాయి జనసేన పార్టీ మహాసభకు సంబంధించిన ‘చలో నిజామాబాద్’ పోస్టర్‌ను జగిత్యాలలో ఆవిష్కరించారు. జగిత్యాల పట్టణంలోని శివసాయి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశంలో జగిత్యాల నాయకులు బెక్కం జనార్ధన్, మీసాల శ్రీనివాసరావు పోస్టర్‌ను విడుదల చేశారు.

సమావేశంలో జగిత్యాల నియోజకవర్గంతో పాటు రాయికల్ మండలం, ఇతర గ్రామాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే నాయకులను సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, జనసేన ఆ పాత్రను పోషించే దిశగా పార్టీ కార్యాచరణ కొనసాగుతోందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో పార్టీ విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో బెక్కం జనార్ధన్, సట్టా సతీష్, బొల్లి రాము, బత్తిని బాబు, ఆకుల వెంకటేష్, మొగులోజి విజయ, బొమ్మడి పావని తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.