
అవనిగడ్డ: తొలి దశలో క్యాన్సరును గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సోమవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ నందమూరి బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరం ప్రారంభం సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు – బసవ తారకం చిత్రపటానికి, స్వర్గీయ ఎంవీ కృష్ణారావు చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ వ్యాధికి గురై విదేశాల్లో ఆపరేషన్ కోసం వెళ్లినపుడు పేదల గురించి బసవతారకం చేసిన సమున్నత ఆలోచన ఫలితంగా ఎన్టీఆర్ హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసి నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు సైతం క్యాన్సర్ చికిత్స చేరువ చేశారని తెలిపారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని పరీక్షలతో కూడిన బస్సులను ప్రజలకు చేరువ చేయటం అభినందనీయం అన్నారు. ఈ ప్రత్యేక బస్సు ద్వారా మండలంలో రెండు శిబిరాలు ఏర్పాటు చేసిన నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావును అభినందించారు. క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందేందుకు ఈ స్క్రీనింగ్ శిబిరాలు పేదలకు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్లు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ (లంకబాబు), గుత్తికొండ వంశీకృష్ణ, పెద్దిబోయిన హరనాథ్, మాజీ సర్పంచులు పైడిపాముల కృష్ణ కుమారి, కొల్లూరి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు మాలెంపాటి శ్రీనివాసరావు, పైడిపాముల స్వప్న, నీటి సంఘం అధ్యక్షులు గొరిపర్తి సుబ్బారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇబ్రహీం, టీడీపీ నాయకులు మిక్కిలినేని మధు, సజ్జా చలపతిరావు, మాజీ ఎంపీటీసీలు దేవభక్తుని గోపాలకృష్ణ, కొడాలి మురళీ, టీడీపీ లక్ష్మీపురం నేత యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరీ, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాకేష్, పరిశే మౌళి, మాతంగి వేణు, కోట సత్యం, పద్మావతి, మహమ్మద్ హఫీజుర్ రెహమాన్, బావిశెట్టి కనకదుర్గ, షేక్ దిల్షాద్ నజరానా, మేడికొండ రవి, జనసేన నాయకులు గంగిశెట్టి బాబూ రాజేంద్ర, బుల్లా కిషోర్, విశ్రాంత ఈఓఆర్డీ దాసి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.