
అమలాపురం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) వి. సుబ్బారావు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్) కార్యక్రమంలో డీఆర్ఓ ప్రజల నుంచి మొత్తం 101 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి, తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు పంపించారు. కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.