ఆక్వాకల్చర్‌కు అండగా కూటమి ప్రభుత్వం

  1. డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు
  2. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,34,617 హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని, అందులో 1,21,829 హెక్టార్లలో చేపల పెంపకం, 1,12,788 హెక్టార్లలో ఉప్పునీటి సాగు జరుగుతోందని పేర్కొన్నారు. శ్రింప్, సీ బాస్ వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తున్న సుమారు 1.2 లక్షల హెక్టార్లకు 24 గంటల నిరంతర విద్యుత్ అవసరం ఉందని మంత్రి తెలిపారు.

విద్యుత్ అంతరాయం ఉన్న సమయంలో రైతులు డీజిల్ జనరేటర్లపై ఆధారపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సగటున 2 గంటల విద్యుత్ కోత ఉన్నట్లు అంచనా వేస్తూ, ఒక హెక్టారుకు రోజుకు సుమారు 5 లీటర్ల డీజిల్ అవసరం అవుతోందని వివరించారు. వారానికి ఒక హెక్టారుకు 40 లీటర్ల డీజిల్ అవసరం కాగా, మొత్తం 1.2 లక్షల హెక్టార్లకు వారానికి సుమారు 5000 కిలోలీటర్ల డీజిల్ అవసరం ఉంటుందని తెలిపారు.

  1. డీజిల్ సరఫరా పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు

ఆక్వాకల్చర్ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా పరిస్థితిని సమీక్షిస్తూ, డీజిల్ అందుబాటును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

జిల్లా మత్స్యశాఖ అధికారుల సహకారంతో ప్రతి ప్రాంతంలో సమన్వయం కొనసాగుతోందని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి పక్షాన నిలబడి, అవసరమైన మద్దతు అందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.