
- ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పనితీరుపై చంద్రబాబు ప్రశంసలు
కాకినాడ: కాకినాడ జిల్లా అభివృద్ధికి చేయూతనివ్వాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధిపై శనివారం అమరావతిలో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాగంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యి జిల్లా అభివృద్ధిపై చర్చించి, చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాకినాడలో ఆయుర్వేద హాస్పిటల్ కు అనుబంధంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆయుర్వేద కళాశాల కు త్వరితగతిన అనువైన స్థలాన్ని కేటాయించాలని, అలాగే కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల ఆవరణలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం, ఉప్పాడలో నిర్మాణంలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ కు, కాకినాడ బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు, దీంతో పాటు తుని పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, పెద్దమల్లపురం కేంద్రంగా నూతన ఐటీడీఏ ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.
దీంతోపాటు కాకినాడ జిల్లాలో ముఖ్యమైన పలు రహదారుల నిర్మాణం, పీహెచ్ సి, యూపీ హెచ్ సి, అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు, జిల్లాలో హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు మూడు ట్రామా మా కేర్ సెంటర్ లు ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పనితీరుఫై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, ప్రజల నుండి వచ్చే అర్జీలు పరిష్కారానికి చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత చురుగ్గా పనిచేసే ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ ఉదయ్ తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.