
మార్కాపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొని భగీరథ మహర్షి అకుంఠిత దీక్ష, పట్టుదలను ప్రశంసించారు. మహోన్నత లక్ష్య సాధన కోసం ఆయన చేసిన తపస్సు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహం మరియు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకునేందుకు భగీరథ మహర్షి ఎన్నో సంవత్సరాలు ఒంటి కాలుపై తపస్సు చేసి గంగానదిని భూమికి తీసుకువచ్చిన ఘనత సాధించారని వివరించారు.
సంకల్పబలం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, ఈ విషయాన్ని విద్యార్థులు మరియు యువత గ్రహించాలని ఆమె సూచించారు. భవిష్యత్ తరాలకు భగీరథ మహర్షి చరిత్రను తెలియజేయడం ఎంతో అవసరమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పీవీ కృష్ణారావు, భాజపా నాయకులు, ఉప్పర మరియు సగర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.