మెగా ఫ్యామిలీ అభిమానుల ఆత్మీయ సమావేశం

విజయనగరం: నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జీఎస్ఆర్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మెగా ఫ్యామిలీ అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ విజయనగరం జిల్లా నూతన కమిటీ సభ్యుల నియామకాలను అధికారికంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు–రాధిక దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని ప్రకటించారు. మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు చెల్లూరి ముత్యాల నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొయ్యాన లక్ష్మణ్, టీమ్ ప్రతినిధుల సమక్షంలో కమిటీ నియామకాలు జరిగాయి.

సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమానులు, విజయనగరం పరిధిలోని థియేటర్ మేనేజర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్లను నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్న అభిమానుల ఐక్యత, నాయకత్వ లక్షణాలను గుర్తిస్తూ నూతన కమిటీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

చిరంజీవి సేవా సిద్ధాంతాలు, సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పలువురు సీనియర్ అభిమానులు తెలిపారు. మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఐక్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన మెగా సీనియర్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.