
ఎస్.కోట నియోజకవర్గం: వేపాడ మండలం, వల్లంపూడి గ్రామం, ఏతాపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షులు సుంకర అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు సుమారు 300 మంది గ్రామస్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు తనను బలపరచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, పాటూరు రుద్ర నాయుడు, బోగి రమణ, మేలస్త్రి అప్పారావు మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసే నాయకత్వం అవసరమన్నారు. మజ్జి శ్రీనివాసరావును కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బలపరచి ఆయన విజయానికి గ్రామస్థులు సహకరించాలని కోరారు.
అనంతరం జనసేన నియోజకవర్గ నాయకులను గ్రామ పెద్దలు దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షులు కోలా కన్నయ్యదొర, వీలుపర్తి మాజీ సర్పంచ్ జోజి బాబు, డబ్బిరాజుపేట పోస్ట్మాస్టర్ వెంకటేష్, కోలా మధు, వీలుపర్తి సంతోష్, కరకవలస ఛత్రపతి తదితర జనసేన నాయకులతో పాటు గ్రామ మహిళలు, యువకులు, కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.