
జనసేన పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రచార యాత్రలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల కోఆర్డినేటర్, కొత్తగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీ సంచాలకుడు గడల శ్రీనివాసరావు పర్యవేక్షణలో, జనసేన నాయకుడు రహీమ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమావేశంలో తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ విధానాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలు చర్చించారు.
ఈ కార్యక్రమంలో గడల శ్రీనివాసరావు, పుధరి శ్యామ్ కుమార్, రమేష్ బ్రహ్మం, సాయి సాంబవితో పాటు జనసేన వీరమహిళలు సౌజన్య, విఘ్నేశ్వరి, మౌనిక, ఉమ్మడి ఖమ్మం జిల్లాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.