
అమరావతి రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు “మావిగన్” పేరుతో కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధికి, విధ్వంస రాజకీయాలకు మధ్యే పోటీ సాగుతోందన్నారు.
అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు జాతీయ బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ, ఎన్ఐడీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజధానిపై అనవసర అనిశ్చితి సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు.
అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి త్యాగాలు చేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.57,821 కోట్ల విలువైన 97 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతుల త్యాగాలను, ప్రజల భవిష్యత్తును దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని జగన్ను హెచ్చరించారు.
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సోమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, మంత్రి లోకేశ్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కొత్త నినాదాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు కూడా ఫలించవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలని సూచించారు.