
మార్కాపురం : ప్రభుత్వ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.
సోమవారం మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ సబ్సిడీ రుణాల అమలు, రుణాల మంజూరు పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన రుణాల మంజూరుతో పాటు కౌలు రైతులకు సీసీఆర్సీ (CCRC) కింద రుణాలు అందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కాపురం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా గుర్తించిన నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
అలాగే డీఆర్డీఏ, మెప్మా అధికారులు రుణాల మంజూరు మాత్రమే కాకుండా వాటి సక్రమ వినియోగం, తిరిగి వసూళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, యూనియన్ బ్యాంక్ డీజీఎం రవికుమార్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అప్పలరాజు, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, రిజర్వ్ బ్యాంక్ ఎల్బీఓ ఎలమందరెడ్డి, నాబార్డ్ డీడీఎం రవికుమార్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, ఉద్యాన శాఖ అధికారి రమేష్, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, డీఆర్డీఏ ఏపీడీ నీలకంఠారెడ్డి తదితర అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.