

*బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం
ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విశ్లేషించారు. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అసోమ్, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బిజెపి, ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని ప్రోదిచేసుకోడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఆ రాష్ట్ర ప్రజలు బిజెపికి పట్టం కట్టారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారికి, బీజేపీ పశ్చిమ బెంగాల్ నేత శ్రీ సువేందు అధికారి గారికి, ఈ విజయంలో భాగస్వాములైన బిజెపి నాయకత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. అసోమ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, అసోమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత్ బిశ్వశర్మ గారికి, పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ. కూటమికి విజయాన్ని మళ్ళీ అందించిన ఎన్.ఆర్. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి శ్రీ రంగసామి గారికి అభినందనలు. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. ప్రముఖ కథానాయకుడు, యువకుడు శ్రీ విజయ్ గారి నేతృత్వంలోని టి.వి.కె. పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన శ్రీ విజయ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. అదే విధంగా కేరళలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూ.డి.ఎఫ్. నాయకత్వానికి, నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరు పేరున శుభాభినందనలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.