
మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్ ) కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. వీటిలో 126 రెవెన్యూ సంబంధిత అర్జీలు కాగా, మిగతా 78 ఇతర సమస్యలకు సంబంధించినవిగా ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలిగితే ఈ పరిస్థితి నివారించవచ్చని తెలిపారు.
అధికారులు ఇకపై ఈ దిశగా మరింత చొరవ చూపాలని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైనింగ్ శాఖ జిల్లా ఏడి రవివర్మ, ఐసిడిఎస్ ఇంచార్జ్ పీడీ పద్మావతి, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రాంబాబు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంచార్జ్ అధికారి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.