
దేశంలో బంగారం, వెండి దిగుమతులను క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి.జి.ఎఫ్.టి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని 15 ప్రధాన బ్యాంకులకు బులియన్ దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ దిగుమతులు ఆర్.బి.ఐ అనుమతితో నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ విధానం 2026 ఏప్రిల్ 1 నుంచి 2029 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. బంగారం, వెండి దిగుమతులను నియంత్రిత మార్గాల్లో ట్రాక్ చేయడం, పారదర్శకత పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
అనుమతి పొందిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, బ్యాంక్ యెస్ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. కొంతమంది బ్యాంకులకు మాత్రం బంగారం దిగుమతికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
ఇదిలా ఉండగా, బంగారం దిగుమతులు ఇటీవల గణనీయంగా తగ్గాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం 2026 మార్చిలో భారత్లో దిగుమతులు 9 నెలల కనిష్ఠానికి చేరాయి. కేవలం 3.1 బిలియన్ డాలర్ల విలువైన 20–25 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయింది.
మధ్యప్రాచ్యంలో రవాణా అంతరాయం, మార్కెట్లో డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ పరిస్థితులు వంటి కారణాలు దీనికి దోహదపడ్డాయి.
అయితే పెట్టుబడిదారుల్లో బంగారం పై ఆసక్తి కొనసాగుతోంది. గోల్డ్ ఈటిఎఫ్ లు, డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఏ.ఎం.ఎఫ్.ఐ గణాంకాల ప్రకారం మార్చిలో భారీగా పెట్టుబడులు వచ్చాయి.
అదేవిధంగా 2026 తొలి త్రైమాసికంలో జ్యువెలరీ రంగం కూడా మంచి వృద్ధిని నమోదు చేసింది. వివాహాల సీజన్, అధిక విలువైన కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ వంటి అంశాలు ఈ వృద్ధికి కారణాలుగా నిలిచాయి.