
రాజోలు: మలికిపురం మండలం పరిధిలోని కేశనపల్లి గ్రామంలోని గీతామందిరంలో తాజా మాజీ సర్పంచ్ ఎనుముల నాగు పదవీవిరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హాజరై యెనుముల నాగుని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్గా పనిచేసిన కాలంలో యెనుముల నాగు గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవలందించారని కొనియాడారు. ముఖ్యంగా కేశనపల్లి ప్రాంతంలోని కొబ్బరి చెట్ల సమస్యల పరిష్కారానికి ఆయన కీలక పాత్ర పోషించారని, గ్రామ ప్రజల సమస్యలను ముందుండి పరిష్కరించారని తెలిపారు.
భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధి కోసం ఆయన అనుభవం, సేవలను వినియోగించుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు