

* పార్టీ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ జనసేన పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్సంకల్పంతో, సదాశయాలతో స్థాపించిన పార్టీ ఇది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొనే నిర్ణయాల్లో చిత్తశుద్ధి.. సమాజం పట్ల బాధ్యత ఉంటాయి కాబట్టే జనామోదం లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను, మాటలను విశ్వసిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలకంగా ఉన్నారు. ఊరూరా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దఫా ఆవిర్భావ వేడుకలను ప్రతి ప్రాంతంలో నిర్వహించేలా పిలుపు ఇచ్చారు. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాలుపంచుకుంటూ కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు” అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీ సామినేని ఉదయభాను (పార్టీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా), శ్రీకిలారి రోశయ్య, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు, పార్టీ నేతలు శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ నాయుబ్ కమల్, శ్రీ మండలి రాజేష్, శ్రీ బేతపూడి విజయ్ శేఖర్, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీమతి శివ పార్వతి, శ్రీమతి పార్వతి నాయుడు, శ్రీ గంజి చిరంజీవి, శ్రీ చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.