
అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామ విద్యార్థులకు ఇచ్చిన హామీని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. అడవితల్లి బాట కార్యక్రమం సందర్భంగా ప్రకటించిన నూతన పాఠశాల భవన నిర్మాణం పూర్తి కావడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గత ఏడాది ఏప్రిల్ 7న డోలీ రహిత గిరిజన గ్రామాల లక్ష్యంగా ప్రారంభించిన అడవితల్లి బాట కార్యక్రమానికి పెదపాడు గ్రామం వేదికైంది. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గ్రామంలోని మౌలిక వసతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని గమనించారు.
పాఠశాల భవనం దయనీయ పరిస్థితిని చూసిన ఆయన, అక్కడి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్య అందించేందుకు కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.17.50 లక్షల అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు.
ఈ భవనం త్వరలో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. కొత్త భవనం ద్వారా గ్రామ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కలగనుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.