
సోమవారం పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ పర్యటనలో భాగంగా వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామంలో “ప్రధానమంత్రి ఎస్.సి/ఎస్.టి సూర్యఘర్ యోజన ఉత్సవ్” (ఎస్.సి/ఎస్.టి ఇంటింటికి సోలార్ పంపిణీ) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ మాట్లాడుతూ, ఈ యోజన ద్వారా ఎస్.సి/ఎస్.టి కుటుంబాలకు ఉచితంగా లేదా సబ్సిడీతో సౌర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పేద కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపర్చడానికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
ప్రభుత్వం పేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి ఇంటికి విద్యుత్ అందించడమే కాకుండా స్వచ్ఛమైన, తక్కువ ఖర్చుతో కూడిన శక్తిని అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.
సూర్యఘర్ యోజన వల్ల విద్యుత్ బిల్లులు తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడడం, గ్రామాలు స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రతి అర్హ కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. అధికారులు పారదర్శకంగా, వేగంగా అమలు చేయాలని సూచించారు.
పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.