
ముమ్మిడివరం: కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెంకు చెందిన బండారు వీర గణేష్ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి మూడవ ర్యాంక్ (992 మార్కులు) సాధించిన సందర్భంగా ఆదివారం గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, స్థానిక రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు పాల్గొని విద్యార్థిని అభినందించారు. మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు త్సవటపల్లి నాగేంద్ర (నాగు), కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదశి నాగేశ్వరావు, వైకాపా నాయకులు జగతా బాబ్జి, జనసేన నాయకులు గోదశి పుండరిష్, మహిళా కళాశాల కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మనందం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. వీర గణేష్ 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ఉత్తమ మార్కులు సాధించినందుకు అభినందనలు తెలిపారు. అతనికి రూ.10,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
విద్యార్థి ప్రతిభను గ్రామస్తులు ప్రశంసిస్తూ, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.