సీ.ఎం రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పాలమూరు ప్రాంత అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఎం పర్యటనకు ముందు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించాయి.

పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వాటి పూర్తి కోసం ఎంత మేర నిధులు కేటాయిస్తున్నారో ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సీఎం పర్యటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

అలాగే రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన బీఆర్ఎస్, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది.

పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై త్వరలో భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. నిరసనల నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.