
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రకృతిని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని, తమ తల్లిపై ప్రేమ, గౌరవానికి గుర్తుగా అమ్మ పేరిట కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ను సందర్శించిన పవన్ కళ్యాణ్, అరుదైన ‘తెల్ల పొనికి’ మొక్కను నాటారు. కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే ఈ మొక్కకు ప్రత్యేక సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. తన తల్లి అంజనా దేవికి అంకితంగా ఈ మొక్కను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు భావోద్వేగపూరిత సందేశాన్ని జోడించారు.
ప్రజలు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని కోరిన ఆయన, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. సమష్టిగా కృషి చేస్తే ప్రకృతి సంరక్షణ లక్ష్యం సులభంగా సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.