
ప్రకాశం: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమన్నారు.
వాహనాన్ని నడిపే ముందు టైర్ల పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని, గాలి సరిపడగా ఉందో లేదో చూసుకోవాలని, పాడైన లేదా దెబ్బతిన్న టైర్లను వెంటనే మార్చాలని సూచించారు. అలాగే వాహనం ఇంజిన్ స్థితిని ముందుగానే చెక్ చేయడం ద్వారా ప్రయాణంలో సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
ఎండాకాలంలో ఇంజిన్ వేడెక్కే అవకాశం ఎక్కువగా ఉండటంతో రేడియేటర్లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని, కూలింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. ముఖ్యంగా దీర్ఘ ప్రయాణాలు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిదని, ఈ సమయంలో వాహనాన్ని మళ్లీ పరిశీలించుకోవాలని తెలిపారు. డ్రైవర్లు అలసటకు గురికాకుండా ఉండేందుకు విరామాలు అవసరమని, అలసటతో డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ప్రయాణ సమయంలో తగినంత నీరు తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. అవసరమైతే ఉదయం లేదా సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చని తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. అలాగే అతివేగం, రాంగ్ రూట్లో ప్రయాణం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వినియోగం ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.