
మంగళగిరి: పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ ఎన్రిచ్మెంట్ నెట్వర్క్ (ఏపీ-గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న శాసన మండలి సభ్యుడు నాగబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతాన్ని పచ్చదనంతో నింపే బృహత్ లక్ష్యాన్ని నాగబాబు ముందుకు తీసుకెళ్లనున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకృతిపై అపారమైన ప్రేమ ఉన్న నాగబాబు, ఏపీ-గ్రీన్ సంకల్పాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచే బాధ్యతల్లో నాగబాబు విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా కేబినెట్ హోదాలో నాగబాబును నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన కూటమి పక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు