
భీమవరం: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో చదువరులకు అవసరమైన పుస్తకాలను అందజేశారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే సుమారు పదివేల రూపాయల విలువైన 21 పుస్తకాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు తన సొంత నిధులతో అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, పుస్తక పఠనం ద్వారా అనేక మంది ప్రపంచ మేధావులుగా ఎదిగారని తెలిపారు. పుస్తకాలు మనిషికి ఉన్నత ఆలోచనలు కలిగించి నీతివంతమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు.
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజును ఆయన అభినందించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ..ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గ్రూప్స్, డీఎస్సీ, రైల్వే, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ గ్రంథాలయంలో చదివిన అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, విద్యార్థులు కూడా అదే మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం రీడర్స్ చైర్మన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ, అల్లు శ్రీనివాస్, గ్రంథాలయ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, సిబ్బంది సోమరాజు, పుష్ప, చదువరులు పాల్గొన్నారు