
అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు సమర్పించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు స్పందించారు.
మద్యం దుకాణాల్లో ప్రతి సీసాపై తాను రూ.20 వసూలు చేస్తున్నట్లు చేసిన ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఆధారాలు ఉంటే వాటిని అందించాలని కోరారు.
అదేవిధంగా ఏ గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వివరాలు అందిస్తే వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. తాము నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలోనూ, ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సమావేశాల్లోనూ ఇప్పటివరకు బెల్ట్ షాపులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు.
బెల్ట్ షాపులపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నాయో వివరాలు అందిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కంటే వాస్తవాలను అధికారుల దృష్టికి తీసుకురావడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్న మండలి బుద్ధప్రసాద్, నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.