విద్యార్థినుల భవిష్యత్తుకు సి.ఎస్.ఆర్ తోడ్పాటు.. మంత్రి దుర్గేష్ ప్రశంసలు

  1. ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన మలబార్ గోల్డ్ ఛారిటబుల్ సంస్థ..ప్రశంసించిన మంత్రి దుర్గేష్
  2. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు సామాజిక సంస్థల ఆర్థిక చేయూత అవసరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో తెస్తున్న సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు ఇతోధికంగా సాయం చేయడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నవభారత నిర్మాణానికి దోహదపడుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

ఆదివారం రాజమండ్రి కరెంట్ ఆఫీస్ సమీపంలో త్యాగరాజు నారాయణదాసు సేవా సమితి నందు మలబార్ గోల్డ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు ప్రభుత్వ కళాశాలలకు చెందిన దాదాపు 286 మంది మెరిట్ విద్యార్థినులకు రూ. 22.56 లక్షల సీఎస్ఆర్ స్కాలర్ షిప్ లు అందించడం ప్రశంసనీయమన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. లాభాల్లో 5 శాతం సామాజిక సేవకు కేటాయించడం, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యతనివ్వడం మలబార్ గోల్డ్ సంస్థ ఉన్నత సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. భ్రూణ హత్యలు, లింగ వివక్ష లేని నవ సమాజం వైపు అడుగులు వేయాలని, కౌమార దశ నుంచే బాలికలకు సాధికారతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన దశ అని మంత్రి పేర్కొన్నారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, త్వరలో మలబార్ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేసే ‘మైక్రో లెర్నింగ్ సెంటర్స్’ను వినియోగించుకోవాలని సూచించారు.

విద్యా సంస్కరణల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి తోడు, కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం నవభారత నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. ఆడపిల్లల చదువుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయన్నారు.

రాష్ట్ర విద్యావ్యవస్థలో వచ్చిన సంస్కరణలతో విద్యకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువు ఆగకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెబుతూ విద్యార్థులందరికీ మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.