
అమరావతి: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ, పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాభిమానం, ఆత్మగౌరవం అనే మహోన్నత లక్ష్యాలతో 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహత్తర రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలు, సిద్ధాంతాలు నేటికీ కోట్లాది ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఐటీ రంగ వికాసం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని ఆయన కొనియాడారు. సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు.
నేటి పరిస్థితుల్లో కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, మహిళల సాధికారత కోసం పార్టీ కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త పార్టీ పట్ల మరింత అంకితభావంతో పని చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకోవాలని రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ బలపడి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.