ఐపీఎల్ 2026 తొలిదశ షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త ప్రకటించింది. వారం రోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28 నుంచి టోర్నీ ప్రారంభమవనుంది.

డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌కు శ్రీకారం చుడనున్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే తొలి దశలో పది జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ దశలో మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ ప్రస్తుతం తొలి దశ షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

2017 తర్వాత తొలిసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆడనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ పాల్గొనడం ఇది రెండోసారి కాగా బెంగళూరుకు ఇది ఏడోసారి కావడం విశేషం.

తొలి దశలో 16 రోజులపాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు డబుల్ హెడ్డర్‌లు ఉండనున్నాయి. ఏప్రిల్ 4న ఢిల్లీ మరియు ముంబై మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరుగుతుండగా, అదే రోజు గుజరాత్ మరియు రాజస్థాన్ జట్లు అహ్మదాబాద్‌లో రాత్రి తలపడనున్నాయి. అలాగే ఏప్రిల్ 5, 11, 12 తేదీల్లో కూడా డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్వదేశ మైదానంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఏప్రిల్ 5న మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో మ్యాచ్‌ల నిర్వహణపై ఇంకా స్పష్టత లేకపోయినా, ఈనెల 13న కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించిన తర్వాత తుది నిర్ణయం వెల్లడించనుంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.