
• తొలి రోజే సభ్యత్వం నమోదు చేసుకున్న లక్ష మంది
జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సమధికోత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమి సభ్యత్వ నమోదును మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.2 కోట్లు విరాళంగా అందించి సభ్యత్వం స్వీకరించారు. ఈ నెల 19న పిఠాపురం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టారు. అయిదు రాష్ట్రాల్లో సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గం. 30 ని. నుంచే వేలాది మంది సాధక్ లు ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టారు. తొలి రోజే లక్ష మంది సభ్యత్వం తీసుకున్నారు.
పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా పలువురు జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, పార్టీ నేతలు పాల్గొన్నారు. నిడదవోలులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధక్ లకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. 25 నియోజకవర్గాల పార్లమెంట్ కో ఆర్డినేటర్లు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించారు.
గురువారం సాయంత్రం ఉద్యమి సభ్యత్వ నమోదుపై శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి రోజు సభ్యత్వ నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సమీక్షలో పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు, ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస్ మిరియాల గారు పాల్గొన్నారు.