
అమరావతి: ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మార్చి 14న పిఠాపురంలో నిర్వహించాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మొదటగా ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని, అయితే ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమ స్వరూపాన్ని మార్చామని వివరించారు.
దీనికి బదులుగా ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి జిల్లాలు, నగరాలు, మండల కేంద్రాలు మరియు పంచాయతీల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మార్చి 14 జనసైనికులకు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు పండగలాంటి రోజు అని ఆయన పేర్కొన్నారు.
ఆ రోజు పార్టీ పతాకాన్ని జనసైనికులు, వీర మహిళలు, నాయకులు మరియు ఉద్యమ సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేయాలని సూచించారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధికి పార్టీ కట్టుబాటు గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించేలా ప్రతి ప్రాంతంలో స్థానికంగా వేడుకలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.