చట్ట సభల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి

* జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ సూచన
క్షేత్ర స్థాయి ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సూచించారు. శాసనసభ, మండలిలో జరుగుతున్న తీరు, పార్టీ ప్రజాప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలు, పాల్గొంటున్న చర్చలు, చట్టసభల్లో అనుసరించబోయే వ్యూహం గురించి సోమవారం అసెంబ్లీలోని జనసేన పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో శ్రీ మనోహర్ గారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రసార మాధ్యమాల్లో మాట్లాడే సమయంలో పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూనే… వైసీపీ కులాల మధ్య పెడుతున్న చిచ్చుల కుట్రలను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విలువైన చట్టసభల సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ముందస్తు ప్రణాళికతో సభకు రావాలని చెప్పారు. ప్రజా సమస్యలను, ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తగినంత సమయం కేటాయించాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.