
కాకినాడలోని జయ రెసిడెన్సి హోటల్లో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
శెట్టిబలిజ సంఘానికి పునాదులు వేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. సమాజ అభివృద్ధికి విద్యే మూలమని విశ్వసించిన వెంకటరెడ్డి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, బీసీ వర్గాల్లో విద్యపై అవగాహన పెంచేందుకు అనేక సంక్షేమ సంస్థలను స్థాపించారని తెలిపారు. ఆ సంస్థల ద్వారా అనేక మంది విద్యావేత్తలు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.
ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వానికి శెట్టిబలిజ వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు ఒమ్మి బాలాజీ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, బొంతు పెదబాబు, కడలి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్, కేత శ్రీను, పెంకే జగదీష్, రామలింగేశ్వరరావు, మంత్రి ప్రగడ వారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు లుటుకుర్తి మోహన్, పంపన బుజ్జి, అంజిబాబు, పాలిక నాని, సూర్య, వడిసెల దానమ్మ తదితరులు పాల్గొన్నారు.