
• రెండు నెలలకి ఒకసారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటన
• ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరానికి కృషి
• కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి
• జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దిశానిర్దేశం
• నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
• జిల్లా పరిధిలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనబడరాదు
• వర్షాకాలానికి ముందే కాకినాడ జిల్లా పరిధిలో గ్రేట్ గ్రీన్ వాల్ పూర్తి చేయాలి
ఇక మీదట కాకినాడ జిల్లా పరిధిలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారితో సమావేశం అయ్యారు. కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
• అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించండి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిన చోట కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలి. చిన్న చిన్న గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలి. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్ధులకు అవసరం అయిన సౌకర్యాల కల్పన పై ఆలోచన చేయాలి. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. నైపుణ్యాన్ని వృద్ధి చేసి వారిలో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేయాలి. గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. యువతలోని నైపుణ్యాన్ని, కొత్త ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాల”ని కలెక్టర్ కు సూచించారు.
• రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వర్షాకాలం లోపు కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలు సూచనలు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్ మాఫియాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.