

• పంచాయతీల్లో సుస్థిర పాలనకు జాతీయస్థాయి గుర్తింపు
• కూటమి ప్రభుత్వ కృషికి ఇది నిదర్శనం: శ్రీ పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణంగల పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసంపాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకోవడం మరింత సంతృప్తినిచ్చింది. సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకర్గం పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికయ్యింది. గత ఏడాది కూడా వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 4 అవార్డులు గెలుచుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అత్యుత్తమ పని తీరుతో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడానికి కృషి చేసిన ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, అధికార యంత్రాంగానికి హృదయపూర్వక అభినందనలు. గ్రామీణాభివృద్ధికి మేము చేస్తున్న కృషిని గుర్తించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ లలన్ సింగ్ గారికీ ధన్యవాదాలు. ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనం అని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.