
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలోని సర్వదేవత సపాత రమణ ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శ్రీ మహా రుద్ర సహిత గాయత్రీ యాగం నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రహ్మశ్రీ నేతేటి బాల సూర్య సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించింది. యాగశాలలో శివలింగ పూజ, హోమం, వేద మంత్రపారాయణాలతో భక్తిపూరిత వాతావరణం నెలకొంది. మహాదేవుని అనుగ్రహంతో పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మరింత ఉత్సాహంగా ప్రజాసేవ కొనసాగించాలని ప్రత్యేక సంకల్పంతో పూజలు నిర్వహించారు.
రుద్ర మంత్రాలతో నిర్వహించే ఈ హోమం వల్ల అనారోగ్యాలు తొలగి, శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రజా నాయకుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఇలాంటి యాగాలు నిర్వహించడం సనాతన సంప్రదాయంలో భాగమని నిర్వాహకులు తెలిపారు.
శర్మ ఆహ్వానం మేరకు చీపురుపల్లి జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నాయకులు శంకర్ నాయుడు, ఎచ్చర్ల లక్ష్మినాయుడు, బింగి శ్రీనివాసరావు, మోహన్ రమణతో పాటు స్థానిక జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగం ముగింపులో పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి ప్రజాసేవను కొనసాగించాలని మహాదేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.