
తిరుపతి: పెట్రోల్, డీజిల్ పై వైసీపీ నిరసన కేవలం రాజకీయ డ్రామా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. వైసీపీ నాయకులు సోమవారం నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద నిరసన పేరుతో హడావుడి చేయడం ఉనికిని కాపాడుకోవడానికే అని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య తలెత్తకుండా చూస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవింద రావు పెట్రోల్ బంక్ లను పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. యుద్ధం ముగింపు పై అనిశ్చితి కారణంగా ప్రజలు ముందస్తుగా పెట్రోల్, డీజిల్ తమ వాహనాలకు నింపుకోవాలన్న కోరిక వల్ల అక్కడక్కడ పెట్రోల్ బంక్ ల వద్ద ప్రజలు క్యూ లైన్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. వైసీపీ నాయకుల నాటకాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారని ఆయన చెప్పారు.