
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నేటి నుంచి దశలవారీగా పునఃప్రారంభిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఛైర్మన్ షేక్ హమ్మూద్ ముబారక్ అల్-హమ్మూద్ అల్-సబా ప్రకటించారు. స్థానిక మరియు అంతర్జాతీయ అధికారులతో సమన్వయం చేసుకుని, అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.
ప్రారంభ దశలో ప్రాధాన్యతల ఆధారంగా కొన్ని టెర్మినల్స్ ద్వారా మాత్రమే విమాన సేవలు అందించబడతాయి. ప్రతి దశను జాగ్రత్తగా సమీక్షించిన తర్వాతే సేవలను విస్తరించే ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఇరాన్ మరియు దాని అనుబంధ సాయుధ బృందాల దాడుల వల్ల విమానాశ్రయానికి జరిగిన నష్టాన్ని ఇప్పటికే అంచనా వేశారు.
సాంకేతిక బృందాలు మరమ్మతు పనులను ప్రారంభించాయని, విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా మౌలిక సదుపాయాలను వేగంగా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.