
పిఠాపురం, గొల్లప్రోలు బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు అక్రమాలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా తనపై వస్తున్న బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు. అక్రమాలను నిరోధించేందుకు కృషి చేస్తుంటే కొందరు అధికారులు, ఇతరులు కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
అయితే తాను ఎటువంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం, అలాగే హిందువులు పూజించే గోవుల రక్షణ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ మాఫియా, గోవు మాఫియాలను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
రేషన్, గోవు, మైనింగ్, భూ కబ్జాలు, కల్తీ ఆహారాల వంటి అక్రమాలపై ఎలాంటి ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమిలో భాగంగా బీజేపీ తరఫున స్థానిక అధికారులతో కలిసి అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి బెదిరింపులకైనా ఎదురొడ్డి అక్రమాలను నిర్మూలించేందుకు ముందుంటారని చిట్టా మధు హెచ్చరించారు.