
హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రముఖ వామపక్ష నాయకుడు కీర్తిశేషులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జయంతి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి, సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే. నారాయణ, ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజేశ్వర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం “బొద్దింకల ఆవిర్భావం – యువత, నెటిజెన్స్ ఎటువైపు?” అనే అంశంపై కే. శ్రీనివాసరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. చండ్ర రాజేశ్వరరావు దేశ రాజకీయాలు, కమ్యూనిస్టు ఉద్యమానికి అందించిన సేవలను వక్తలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు పీజే చంద్రశేఖరరావు, హోమ్ డైరెక్టర్ ఈ. చెన్నకేశవులు, మెడికల్ డైరెక్టర్ డా. కే. రజిని, ఉమెన్ వెల్ఫేర్ డైరెక్టర్ జే. కల్పన, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, అమ్మనబ్రోలు వెంకట సత్యనారాయణ, అమ్మనబ్రోలు రాంబాబు తదితరులు పాల్గొని చండ్ర రాజేశ్వరరావు సేవలను కొనియాడారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో చండ్ర రాజేశ్వరరావు చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు.