
నిడదవోలు : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రమాద బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న దుఃఖంలో తాము భాగస్వాములమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అలాగే ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.