
ఏలూరు: హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడి యత్నాన్ని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తీవ్రంగా ఖండించారు. అమరావతిపై ఆ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తూ రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక మీడియా స్వేచ్ఛ ను హరించేలా భౌతిక దాడులకు దిగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
మీడియా ప్రశ్నేస్తే జవాబు చెప్పాలి తప్ప ఇలా దాడులకు తెగబడటం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. మీడియాపై దాడి అప్రజాస్వామికం అని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నమ్మకం ఉన్న రాజకీయ శక్తులు భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. ఏబీఎన్ ప్రసారాలపై అభ్యంతరం ఉంటే దానిని తెలియపరిచేందుకు చట్టబద్ధమైన దారులు చాలా ఉన్నాయన్నారు. స్వయంగా ఒక మీడియా సంస్థ (సాక్షి) ను నిర్వహిస్తున్న జగన్ రెడ్డి తన వైసీపీ నాయకులు ద్వారా ఈ తరహా దాడులకు పాల్పడడం గర్హనీయం అని పేర్కొన్నారు.