
• రూ.1.30 కోట్ల బీమా చెక్కుల పంపిణీ
• మూడు రోజుల్లో 53 కుటుంబాలకు రూ.2.65 కోట్ల బీమా చెక్కులు అందజేత
జనసేన పార్టీకి జనసైనికులు, వీరమహిళలే బలం… బలగం. వారిని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ… ఎల్లవేళలా అండగా ఉంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 26 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.1.30 కోట్ల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ తాళ్లూరి గారు మాట్లాడుతూ… “ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సదుద్దేశంతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు కొన్ని వందల కుటుంబాలకు ఆర్థికంగా భరోసానిచ్చింది. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది” అన్నారు. గత మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53 క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 2.65 కోట్ల విలువైన బీమా చెక్కులు అందించి వారికి అండగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ గంజి చిరంజీవి, శ్రీ పొన్న యుగంధర్, శ్రీ అళహరి సుధాకర్, శ్రీ దేవర మనోహర్, శ్రీ గోకుల రవీందర్ రెడ్డి శ్రీ వి.దుర్గారావు, శ్రీ మంజునాథ్ గౌడ్ పాల్గొన్నారు.