
శ్రీశైలం: భ్రమరాంబాదేవికి మంగళవారం సంప్రదాయబద్దంగా కుంభోత్సవం నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారంలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం) అమ్మవారికి సమర్పించబడ్డాయి. కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, సహాయాధికారులు, పర్యవేక్షకులు మరియు సంబంధిత సిబ్బంది ఉత్సవంలో పాల్గొన్నారు. మొత్తం దాదాపు 20 వేల గుమ్మడికాయలు, 5 వేల కొబ్బరికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు సమర్పించారు.
పసుపు, కుంకుమల సమర్పణ “శాంతి ప్రక్రియ”గా పేరుగాంచింది. స్థానిక వ్యాపార సంఘం కూడా సాత్త్విక బలికి సహకరించారు. ఉదయం ప్రాత:కాల పూజల అనంతరం ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను నిర్వర్తించారు. రజకునిచే ప్రత్యేక ముగ్గు వేయించి విశేష పూజలు, తరువాత కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించబడ్డాయి.
హరిహరరాయగోపుర ద్వారం వద్ద మహిషాసురమర్దని (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు, సాయంకాలం శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడింది. సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీవేషంలో ఉన్న పురుషుడు కుంభహారతిని సమర్పించి ఉత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని ప్రారంభించారు. చివరగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పిండివంటలతో మహానివేదన నిర్వహించబడింది. గ్రామదేవత అంకాళమ్మకు కూడా ప్రత్యేక పూజలు జరిగింది.