
LPG Tankers | గల్ఫ్ ప్రాంతం నుంచి రెండు భారీ ఎల్పీజీ క్యారియర్ నౌకలు భారత్ తీరానికి వస్తున్నాయి. బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ పేర్లతో ఉన్న ఈ నౌకల్లో సుమారు 94 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, బీడబ్ల్యూ టీవైఆర్ నౌక మార్చి 31న ముంబైకి చేరుకోగా, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ నౌక ఏప్రిల్ 1న న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ సరఫరాతో దేశంలో ఎల్పీజీ నిల్వలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నౌకలు, నావికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేసింది. పశ్చిమ పర్షియన్ గల్ఫ్లో 18 భారత నౌకలు, 485 మంది నావికులు ఉన్నట్లు వెల్లడించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌక యజమానులు, భారత రాయబార కార్యాలయాలతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తూ, ఇప్పటివరకు 942 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయపడింది.
దేశంలోని అన్ని ఓడరేవుల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ఎక్కడా రద్దీ లేదని అధికారులు తెలిపారు. గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతాల్లో భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రత్యేక హెల్ప్లైన్లు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయం అందిస్తోంది.