

* ఉచిత విద్యుత్ పథకంతో చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా చేనేత మగ్గానికి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందజేయనున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ది చేకూరనుంది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చిన్న చేనేత కుటుంబాలకు ఉత్పత్తి వ్యయం తగ్గి కొంత మేర ఉపశమనం లభించనుంది. 2017లో నేతన్నలు నన్ను కలసి వారి కష్టాలు చెప్పుకొన్నప్పుడు నా మనసు చలించింది. వారికి నా వంతు అండగా నిలిచేందుకు నాకు నేనుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చాను. వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని నేనిచ్చిన పిలుపు యువతలో చైతన్యం నింపింది. నివార్ తుపాను కారణంగా వెంకటగిరి చేనేత మగ్గాలకు నష్టం జరిగినప్పుడు స్వయంగా వెళ్లి వారి కష్టాలు చూసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చాను. ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న వేళ కూటమి భాగస్వామ్యపక్షంగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. గడచిన 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ… అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్న ప్రతి చేనేత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.