
మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న సిపిఐ కార్యాలయం మరియు పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఎర్రయ్య తన తండ్రి కాగుటూరి సత్యానందం జ్ఞాపకార్థం రూ.1 లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ చేతుల మీదుగా భవన నిర్మాణ నిధికి నగదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ పూల సుబ్బయ్య ఆశయాలు, సిద్ధాంతాలు తమ కుటుంబంపై గాఢమైన ప్రభావం చూపాయని తెలిపారు. తన తండ్రి జీవితాంతం ప్రజాసేవకు అంకితమై సిపిఐతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించారని గుర్తు చేసుకున్నారు.
భవన నిర్మాణం కోసం ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించి రూ.30 లక్షల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పూల సుబ్బయ్య శాంతి భవన్ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.