
మార్కాపురంలో పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి సందర్భంగా పూల సుబ్బయ్య భవన్కు మంగళవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. సిపిఐ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూల సుబ్బయ్య ఆశయాలను చిరస్థాయిగా నిలబెట్టే కేంద్రంగా ఈ భవన్ రూపుదిద్దుకోనుందని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, పార్టీ జిల్లా ఇంచార్జి జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎం.ఎల్. నారాయణ, ఒంగోలు, బాపట్ల జిల్లా కార్యదర్శులు ఆర్. వెంకటరావు, టి. సింగరకొండ, పార్టీ నాయకులు అందే నాసరయ్య, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.వి. కృష్ణగౌడ్, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఎర్రయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్.కె. కాశీం, పూల సుబ్బయ్య కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూల సుబ్బయ్య–తాయమ్మ విగ్రహాలకు కె. రామకృష్ణ, జి. ఈశ్వరయ్య, ఎం.ఎల్. నారాయణ, జంగాల అజయ్ కుమార్ తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు “జోహార్ పూల సుబ్బయ్య–తాయమ్మ” అంటూ నినాదాలతో నివాళి అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు.