రైతులు కోరగానే రోడ్డు వేయించారు

• శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో కొయ్యలగూడెం మండలంలో మూడు నెలల్లో డొంక రోడ్డు నిర్మాణం
• రూ. 60 లక్షల వ్యయం.. 12,500 మందికి సౌకర్యం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండల పరిధిలోని ఎర్రంపేట, రాజవరం గ్రామాల రైతుల రవాణా కష్టాలకు విముక్తి కలిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎర్రంపేట – రాజవరం మధ్య నిర్మించిన 3 కిలోమీటర్ల డొంక రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణంతో 12,500 మంది ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు, పండిన పంటలు ఇంటికి తెచ్చుకునేందుకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గత ఏడాది నవంబర్ 24వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు డొంక రోడ్డు నిర్మించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. రోడ్డు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లేందుకు సరైన దారిలేక పడుతున్న ఇబ్బందులను ఆయనకు చెప్పుకొన్నారు. స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎర్రంపేట డొంక రోడ్డు నిర్మాణం తక్షణం చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో కదిలిన అధికారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు ప్యాకేజీలుగా రూ. 60 లక్షలు మంజూరు చేసి, మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.